20, అక్టోబర్ 2016, గురువారం

First Doctors of India - భారత దేశపు తోలి వైద్యులు

మన తొలి డాక్టర్లు :

మన తొలి డాక్టర్లు
కాయకల్ప చికిత్సల నాటి కాలం నుంచి నేడు కార్పొరేట్ చికిత్సలు పొందుతున్నాం. చిట్కా వైద్యాల కాలం నుంచి మోడరన్ మెడిసిన్ వైపు పురోగమిస్తున్నాం. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాక ముందు మనకు వైద్యులే లేరా? బీసీనాటి కాలంలో భిషగ్వరులే లేరా? ఉన్నారు! అనాదిగా జరిగిన పరిశోధనలతో మన వైద్యశాస్త్రాన్ని పరిపుష్ఠం చేసిన మన పూర్వ ఆయుర్వేద డాక్టర్లలో కొందరి గురించి కొంత... వారు చెప్పిన అంశాల్లో నేటికీ పాటిస్తున్న వివరాల గురించి మరికొంత...


చరకుడు
మన భారతీయ వైద్యానికి మూలపురుషులుగా భావించే వారిలో చరకుడు ఒకరు. ఆయన జీవించిన కాలం క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం. నిజానికి అంతకు ముందు నుంచీ వైద్యచికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలోనే పునర్వస ఆత్రేయుడు మౌఖికంగా వైద్యచికిత్సల గురించి చెబుతూ ఉండగా అగ్నివేశుడు అనేక అంశాలను గ్రంథస్తం చేసినట్లు దాఖలాలు ఉన్నాయి. అయితే వాటిలోని చాలా విషయాలను క్రీ.పూ. రెండో శతాబ్దంలో చరకుడు సంస్కరించారు.

ఆ తర్వాత దృఢబలుడు అనే వైద్యనిపుణుడు సైతం అందులోని అనేక విషయాలను సమీక్షిస్తూ మళ్లీ సంస్కరించారు. అయితే తొలినాటి చరకుడి పేరిటే ఆ వైద్యశాస్త్రమంతా చెలామణీ అయ్యేలా దృఢబలుడు గౌరవించాడు. దాంతో ఆ వైద్యగ్రంథమంతా ‘చరకసంహిత’గానే ప్రఖ్యాతి పొందింది. అనేక వైద్యశాఖలకు చెందిన విషయాలను ఒకే చోట చెప్పారు కాబట్టే వాటిని ‘సంహిత’గా ప్రస్తావించారు. చరక సంహితలో పేర్కొన్నవే అయినా ఆధునిక వైద్యం కూడా ఇప్పటికీ పాటిస్తున్న అంశాల్లో కొన్ని...

ఆమలకీ (ఉసిరికాయ) తింటే శతాయుష్షు కలుగుతుంది. రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్-సి పుష్కలంగా దొరికే స్వాభావికమైన పదార్థాలలో ఉసిరి చాలా ప్రధానం. అందుకే ఉసిరికాయతో వ్యాధులన్నీ దూరం.

ఆధునికభాషలో చెప్పాలంటే సంభోగశక్తి పెంచే మందులను ఆఫ్రోడెసియాక్స్ అంటారు. ఆయుర్వేదంలో దీనికి ఓ ప్రత్యేక శాస్త్రం ఉంది. దాని పేరే ‘వాజీకరణం’. ఇందులోని అనేక వైద్యచికిత్సలను ఆయుర్వేద వైద్యులు ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఉదాహరణకు పిప్పరీక్షీరం, యష్టిమధుచూర్ణం, శతావరిఘృతం.

పక్షవాతానికి ‘వస్తి’కర్మ అనే ప్రక్రియను ప్రయోగించి ఫలితాలు సాధించాడు చరకుడు. కషాయాలను శరీరంలోకి పంపే నిరూహవస్తి, ఔషధతైలాలతో చికిత్స చేసే అనువాసనవస్తి... ఈ రెండిటికీ మరో మూడు చికిత్సలు (వమన, విరేచన, నస్య) జోడించి... మొత్తం ఐదుగా కూర్చి వాటిని ‘పంచకర్మ’ చికిత్సలు అంటూ ఇప్పటికీ అనుసరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.

విషపదార్థాలను టాక్సిన్స్ అంటారన్న విషయం తెలిసిందే. అవే విషాలను ప్రమాదకరం కాని విధంగా చాలా కొద్ది మోతాదుల్లో తీసుకుంటే అమృతమవుతాయని చెప్పాడు చరకుడు. ఎన్నో వైద్య విధానాల్లో ఈ మార్గం ఇప్పటికీ అనుసరణీయం.


వాగ్భటుడు
చరక సుశ్రుత కాశ్యప సంహితల్లోని ముఖ్యాంశాలను సంక్షిప్తం చేసి, మరికొన్ని శాస్త్రాలను మిళితం చేసి సరళీకృతమైన సంస్కృతంలో అందించిన గ్రంథాలే... ‘అష్టాంగ సంగ్రహం’, ‘అష్టాంగ హృదయం’ . వీటిలో మొదటిదాన్ని రాసింది వృద్ధ వాగ్భటుడు. రెండోది రాసినవాడు లఘువాగ్భటుడు. వీటినే ‘వాగ్భట సంహిత’లని అంటారు. ఈ సంహితల్లో జ్వరాలను తగ్గించే ఎన్నో కష్టాలను పేర్కొన్నారు. త్రిదోషాల్లో ఒకటైన శ్లేషాన్ని (కఫం) అవలంబక, క్లేదక, బోధక, శ్లేషక, శ్లేష్మాలు అంటూ ఐదు రకాలుగా విభజించిన ప్రత్యేకత వీరిది.
చరక, సుశ్రుత, వాగ్భటులను వృద్ధత్రయం అంటారు.




సుశ్రుతుడు
చరకసంహిత లాగే సుశ్రుతుడి పేరు పెట్టుకున్న అనేక వైద్యవిధానాలను పేర్కొన్న ఇది కూడా అనేకమంది వైద్యులు తమ పరిజ్ఞానాన్ని పొందుపరిచిన గ్రంథం. ఇందులో ఇద్దరు సుశ్రుతులున్నారు. ఒకరు వృద్ధ సుశ్రుతుడు. ఈయన ‘దివోదాస ధన్వంతరి’ అనే వైద్యుడి శిష్యుడు. వీరి కాలం సుమారు 10-15 బీసీ. వీరు రచించిన గ్రంథమే సుశ్రుతసంహిత. అయితే దీన్ని మరొక సుశ్రుతుడు (ఆయన కాలం క్రీ.శ. రెండో శతాబ్దం) సంస్కరించాడు. ఆ తర్వాత క్రీ.శ. ఐదో శతాబ్దంలో నాగార్జునుడు దీనికి ‘ఉత్తర తంత్రాన్ని’ చేర్చాడు.

ఆధునిక వైద్యశాస్త్రంలో శస్త్రచికిత్సగా పేర్కొనే సర్జరీ ప్రక్రియను సుశ్రుత సంహితలో నిపుణులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స చేసే ఎన్నో ఉపకరణాలనూ, శస్త్రాలనూ వారు వర్ణించారు. వారు పేర్కొన్నవీ... ఆధునిక శస్త్రచికిత్సల్లో ఉపకరించేవీ అయిన ఉపకరణాలు ఉదాహరణకు కొన్ని...

జలోదర యంత్ర అంటే... అసైటిస్ కాన్యులా  అర్ధధార శస్త్ర (స్కాల్‌పెల్)
పూర్ణగర్భవతి మరణిస్తే, పొట్టలో కదలికలు కనిపిస్తే అప్పుడు ఉదరచ్ఛేదనం చేసి శిశువును వెలికి తీయవచ్చని ఆయుర్వేదం చెబుతుంది.
 ‘‘వస్తమార విపన్నాయాః కుక్షి ప్రస్పందతేయది,
 తక్షణాత్ జన్మకావే తత్‌పాటయిత్వా ఉద్ధరేత్ భిషక్’’
  చికిత్సకు లొంగని కొన్ని పుండ్ల (దుష్టవ్రణాలు) విషయంలో జలగలను ప్రయోగించి సత్ఫలితాలను రాబట్టారు. మోడ్రన్ మెడిసిన్‌లో లీచ్ థెరపీ అని పేర్కొనే విధానం ఇది.
  భగందరవ్యాధి (ఫిస్టులా)కి క్షారసూత్ర ప్రక్రియ ద్వారా ఫలితం ఉంటుందని నిరూపించాడు. ఇప్పటికీ చాలామంది ఆధునిక శస్త్రకారులు సైతం ఈ ప్రక్రియను ప్రయోగిస్తున్నారు.

మరి కొంతమంది
కశ్యప
కశ్యప సంహిత అని పేరొందిన వైద్యశాస్త్ర అంశాలను మరీచి కశ్యపుడు అనే నిపుణుడు బోధిస్తుండగా ‘వృద్ధజీవకుడు’ అనే ఆయన రాశారు. దీన్నే ‘వృద్ధజీవకతంత్రం’గా పేర్కొంటారు. దీన్నే కాశ్యపసంహిత అని కూడా అంటారు. ఈ సంహిత క్రీ.పూ. ఆరోశతాబ్దికి చెందింది. ఇక్కడ పేర్కొన్న కశ్యపుడితో బాటు చరిత్రలో ఇతర కశ్యపులూ ఉన్నారు. ఈ కశ్యపుల్లో ఒకరు ‘కౌమారభృత్య’ నిపుణుడు. అంటే ప్రసూతి చికిత్సలు, స్త్రీ సంబంధిత రోగాల ప్రత్యేక నిపుణుడు అని అర్థం.  ‘కౌమరభృత్యం’ అంటే స్త్రీలకు, శిశువులకు చెందిన ప్రత్యేక విభాగాలకు చెందిన శాస్త్రపరిజ్ఞానం అన్నమాట.

ఇందులో శిశువు శారీరక, మానసిక వికాస వివరాలు (గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ మైల్‌స్టోన్స్) ఉన్నాయి. గర్భణీ పరిచర్యలనూ (యాంటీనేటల్ కేర్) వివరించారు. ఆధునిక కాలంలో ఇమ్యూనైజేషన్‌ను పోలిన కొన్ని ప్రక్రియలనూ ఈ విభాగంలో వివరించారు. ఇక వృద్ధత్రయం లాగే లఘుత్రయంలోనూ ముగ్గురు వైద్యనిపుణులున్నారు. వారు క్రీ.శ. ఏడో శతాబ్దానికి చెందిన మాధవకరుడు, పదమూడో శతాబ్దానికి చెందిన శారంగధరుడు, పదహారో శతాబ్దానికి చెందిన భావమిశ్రుడు.

మాధవకరుడు
ఈయన మాధవనిదానం అనే గ్రంథాన్ని రాశాడు. మాధవకరుడు ఆమవాత (రుమాటిక్ ఆర్థరైటిస్), అమ్లపిత్త (హైపర్ అసిడిటీ/ గ్యాస్ట్రైటిస్) పరిణామశూల (పెప్టిక్ అల్సర్స్) వ్యాధులు, వాటి చికిత్సలను విశదీకరించాడు. శారంగధరుడనే పండితుడు రాసిన గ్రంథానికి శారంగథర సంహిత అని పేరు. దీనికి కూడా మంచి ప్రామాణికత ఉంది. లఘుత్రయంలో శారంగధరుడు కూడా మంచి పేరు గడించాడు.

సిద్ధనాగార్జునుడు
వనాల నుంచి లభ్యమయ్యే ఔషధ ద్రవ్యాల చికిత్సలో ఉండే కష్టనష్టాలను అధిగమించడానికి మన తెలుగు రాష్ట్రాలలోని శ్రీశైలం ప్రాంతాలలో దొరికే ఖనిజధాతులను శుద్ధి చేసి, ఔషధాలుగా రూపొందించడానికి బాటలు వేశాడు. నిజానికి ఇది ఆయుర్వేదంలో విప్లవశకం. దీన్ని రసశాస్త్ర విప్లవంగా పేర్కొన్నవచ్చు. ‘రస’ అంటే ఇక్కడ పాదరసం. అలాగే రకరకాల ఔషధ నిర్మాణ పద్ధతులనూ (ఫార్మస్యూటికల్ మెథడ్స్) కూడా ప్రస్తావించాడు. ప్రతి మందుకూ మోతాదు (డోసేజ్) నిర్ణయించాడు.

భావమిశ్రుడు
ఆయుర్వేదంలో పచ్చిమిరపకాయను ప్రవేశపెట్టినది భావమిశ్రుడే. అంతవరకు కారానికి మిరియాలు (మరీచ) వాడటం మాత్రమే ఉండేది. ఫిరంగి రోగాన్ని (సిఫిలిస్)ను గుర్తించాడు.

ఎన్నో విలువైన వైద్య పరిశోధనలలో పాలుపంచుకున్న మన పూర్వవైద్యులలో వీరు కొందరు మాత్రమే! ఆ కాలంలోనూ కొందరు కొన్ని ప్రత్యేక వైద్య విభాగాలలో సైతం నైపుణ్యం సాగించారు. ఉదాహరణకు చరకుడు కాయ చికిత్స (జనరల్ మెడిసిన్), సుశ్రుతుడు శల్యతంత్రం (జనరల్ సర్జరీ), కశ్యపుడు కౌమారభృత్య (శిశువైద్యం లేదా పీడియాట్రిక్స్) వంటి వాటిల్లో నైపుణ్యం సాగించారని ప్రతీతి. అయితే వారు వైద్యశాస్త్ర అంశాలన్నింటినీ ఒకే గ్రంథంగా ఒకేచోట కూర్చారు. దాంతో ఆ వైద్యశాస్త్ర గ్రంథాలు ప్రత్యేక విభాగాలుగా గాక... కూర్పు చేసిన పుస్తకాలను సూచించే విధంగా సంహితలు అని పేరొందాయి


- డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు

కామెంట్‌లు లేవు: