17, మార్చి 2020, మంగళవారం

మధుమేహం ఉన్నారు ఆహారం నియమాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు


మధుమేహం ఉన్న వారు ఆహారం నియమాలు అవగాహనా కోశం నవీన్ నడిమింటి సలహాలు  Diabetes





మధుమేహులు తీసుకోదగ్గ ఆహారం


మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

కాకరకాయషుగర్ ఉన్న వారు కాకరకాయలు తింటే మంచిదని మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది చెబుతుంటారు. రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రిస్తుందని అలా చెబుతారు. ఎందుకంటే కాకరకాయలో ప్లాంట్ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్  స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. రోజూ ఉదయం రెండు నుంచి మూడు కాకరకాయల నుంచి రసం తీసుకుని తాగొచ్చు. అలాగే, కాకరకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ఓ చెంచాడు నీటిలో కలుపుకుని రోజూ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

మెంతిమధుమేహ నియంత్రణకు మనలో ఎక్కువ మంది మెంతులను తీసుకోవడం చూస్తుంటాం. ఓ చెంచాడు మెంతులను రోజూ రాత్రి గ్లాసు నీటిలో వేసుసుకుని మరుసటి రోజు ఉదయం నీటిని మాత్రం తాగాలి. మిగిలిన మెంతులను చట్నీ చేసుకుని తినడం లేదా చపాతీలో కలుపుకుని తినడం చేయొచ్చు.

వెల్లుల్లివెల్లుల్లి సహజంగా రక్తపోటు నియంత్రణకు మంచిగా ఉపకరించే ప్రకృతి సిద్ధ ఔషధం. అంతేకాదు డయాబెటిస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో జింక్, సల్ఫర్ ఇన్సులిన్ కాంపోనెంట్స్ వుంటాయి. ఇక వెల్లుల్లిలో  ఉండే పొటాషియం మూత్రం ద్వారా వెళ్లిపోయే దాన్ని భర్తీ చేస్తుంది. అందుకే ప్రతీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి.

అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్)అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ ఈ గింజల నుంచి లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కణాలు ఇన్సులిన్ ను గ్రహించేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓ చెంచాడు గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

దాల్చిన చెక్కగ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే మధుమేహంతో బాధపడేవారు మార్పును గుర్తిస్తారు.

పీచు పదార్థాలుఆహారంలో భాగంగా పీచు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పీచు ఉండే పదార్థాలు వెంటనే గ్లూకోజ్ గా మారవు. వీటి జీర్ణ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. కనుక చక్కెరలు కొంచెం కొంచెంగా విడుదల అవుతాయి. ఓట్స్, పాలిష్ పట్టని ముడి బియ్యం, గోధుమల్లో పీచు ఎక్కువగా లభిస్తుంది.

బీన్స్బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచు దండిగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం పాటు ఇది ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టు భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి ఎక్కువ ప్రయోజనకారి.

బార్లీబార్లీలో నీటిలో కరిగిపోయే ఫైబర్, కరిగిపోని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సూప్ గానూ లేదా సలాడ్స్ లోనూ కలిపి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఆహార సేవన అనంతరం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని 70 శాతం వరకు నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.

క్యారెట్స్క్యారట్లలో కొద్ది మోతాదులో షుగర్ ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు. కానీ, ఈ మోతాదు తక్కువే గనుక తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారట్లలో సహజమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు ఉపకరించేదన్న విషయాన్ని గుర్తించాలి.

తోటకూరరోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని... దాంతో రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గుర్తించడం జరిగింది.

పాలుఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.  

ఓట్ మీల్ఓట్స్ లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్ గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్ లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్ గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్ లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుంది.

ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో ఉండే మంచి ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

క్యాబేజీక్యాబేజీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో క్రోమియం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో రక్తంలో షుగర్ నియంత్రించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.

కొద్ది కొద్దిగా ఆహారంషుగర్ వ్యాధితో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ భోజనాల జోలికి వెళ్లొద్దు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులు స్వల్ప పరిమాణంలో ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం మంచిది. అలాగే, ఎట్టి కారణాల వల్లనూ ఆహారాన్ని మానేయకూడదు.

నట్స్నట్స్ లో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ తేలిక అవుతుంది. నట్స్ లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడతాయి. దీంతో నాడులు, నయనాలు దెబ్బతినకుండా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెరల నియంత్రణకు తోడ్పడతాయి.

దానిమ్మ (పొమెగ్రనేట్స్)ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.

పుచ్చకాయ (వాటర్ మెలాన్)ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి మధుమేహులు గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. ఎందుకంటే జీఐ ఎక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే, పుచ్చకాయలో జీఐ ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్ లో నరాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కానీ, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ దీన్ని నివారిస్తుంది.

కమలాలుడయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. చక్కెర స్థాయులు తక్కువే.

బొప్పాయిబొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది.

జామ
మధుమేహాన్ని నియంత్రించే గుణాలు జామలో ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. జీఐ మోస్తరు స్థాయిలో ఉంటుంది గనుక జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.

నేరేడుపండ్లు (జామూన్)
ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.

యాపిల్స్యాపిల్ లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్ లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్ ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల  టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.  

ఉసిరిఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.

వీటిని తగ్గించేయడం శ్రేయస్కరంసాల్ట్ ను విడిగా తీసుకోవద్దు. వంటల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది. అది మన శరీరానికి సరిపోతుంది. ఎక్కువైతే ఇది సైలంట్ కిల్లర్. అలాగే, పంచదారను కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి. ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి. మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి మళ్లడం మంచిది. హోల్ మిల్క్ (ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి) తీసుకోవద్దు. టీ, కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి. గోధుమలను బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి. జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ ను మానేయాలి. బ్రౌన్ రైస్ మంచిది. ఇది అరగడం కష్టంగా ఉంటే ఒక్కసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు. ఆలుగడ్డలు, బ్రెడ్స్, అరటి పండ్లు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.

ఈ వేళల్లో తప్పనిసరిగా....ఉదయం 5-7 గంటల్లోపు నిద్ర లేచే వారు తప్పకుండా వేకప్ స్నాక్ తీసుకోవాలి. 7 గంటల తర్వాత నిద్ర లేచే వారు 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాలి. ఉదయం 7 లోపు లేచిన వారు వేకప్ స్నాక్ తీసుకున్నా... వారు కూడా 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10-11.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. మధ్యాహ్నం 12-2.30 మధ్య లంచ్ కు సమయం నిర్ణయించుకోవాలి. మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. డిన్నర్ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయం కేటాయించుకోవాలి. ఆహారం నుంచి ఆహరానికీ మధ్య 3 గంటలకు మించకుండా చూసుకోవాలి. డిన్నర్ తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల విరామం ఇచ్చి అప్పుడు నిద్రకు వెళ్లడం మంచిది. ఏ ఆహారం తీసుకున్నా గానీ అది 60:20:20 రేషియోలో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఈ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.

వేకప్ స్నాక్రాత్రి నీళ్లలో నాన బెట్టిన మెంతులను ఉదయం వేకప్ స్నాక్ గా తీసుకోవచ్చు. లేదా యాపిల్ పండు. లేదా రాత్రి నీటిలో నానబెట్టిన ఐదారు బాదం గింజలు. వాటికి తోడు మూడు వాల్ నట్స్. లేదా చెంచాడు అవిసె గింజలను వేయించుకుని తినొచ్చు. ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్. టమాటాను జ్యూస్ లా చేసుకుని అందులో కాస్త మిరియాల పొడి వేసుకుని ఖాళీ కడుపుతో లాగించేయవచ్చు.

బ్రేక్ ఫాస్ట్
ఓట్స్ ను ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ (ఆయిల్ తక్కువతో), కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా. లేదంటే నానబెట్టిన పెసలు లేదా శనగలు వంటి వాటితో గుగ్గిళ్ల వంటివి చేసుకుని లేదా విడిగానూ తీసుకోవచ్చు. వీటికి కొన్ని బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కలుపుకున్నా సరే. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ తినొచ్చు.

స్నాక్ (11 గంటల సమయంలో)యాపిల్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పుకున్న పండ్లలో ఏదేనీ ఒకదాన్ని తీసుకోవచ్చు. ఓ గ్లాసుడు బటర్ మిల్క్ తాగితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి ఆ రోజు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు తోడ్పడుతుంది. కీరదోస, క్యారట్ ముక్కలు తీసుకోవచ్చు. సమోసా లేదా పకోడి వంటివి. బటర్ మిల్క్ తీసుకోకపోతే గ్లాసు పాలు.

లంచ్బ్రౌన్ రైస్ లేదా పరిమితంగా వైట్ రైస్, కాయగూరల మిక్స్ (కీరదోస, క్యారట్లు వంటి ముక్కలు), ఓ చపాతీని, పప్పు తీసుకోవచ్చు. అరటి కూర తీసుకోవచ్చు. ఆలూ పరాటాను కూడా భాగం చేసుకోవచ్చు.

సాయంత్రం స్నాక్టీ లేదా కాఫీ, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ (డేట్స్, వాల్ నట్స్, అంజీర, జీడిపప్పు తదితర). షుగర్ లేని బిస్కెట్లు రెండు లేదా మూడు. లేదా వేయించిన శనగపప్పు.

డిన్నర్మల్టీ గ్రెయిన్ ఆటా పిండితో చేసిన రోటీలు, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో చేసిన కూరను తీసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశను తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత నిద్రకుముందు ఓ కప్పు వేడి పాలు.






'షుగర్' ఉన్న వాళ్లు కూడా మామిడిపండు తినవచ్చట!
మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తోంది. మామిడి పండును చూసినా... ఆ పండు వెదజల్లే పరిమళం ముక్కుపుటాలను చేరినా తినకుండా ఉండడం కష్టతరం. అయితే, ఇంతటి మధురమైన పండును తినే విషయంలో షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. తింటే బ్లడ్ షుగర్ పెరిగిపోతుందేమోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. మరి మామిడి పండును నిర్భయంగా తినవచ్చా...?

నిశ్చింతగా తినవచ్చు అంటున్నారు ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ పంకజ్ అగర్వాల్.  కాకపోతే, ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంతే. మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఒక మ్యాంగోలో ఉన్న కేలరీలు ఒకటిన్నర రోటీలో ఉండే కేలరీలతో సమానం. ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదు. 

కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా, అన్నంతోపాటు మామిడి పండు తినకూడదు. స్నాక్స్ టైమ్ లో స్నాక్స్ కు బదులు మామిడి పండు సగం మేర తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. పైగా తీసుకుంటున్నది కొద్ది పరిమాణంలోనే కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కూడా పెరగవు. కనుక రోజులో నాలుగు గంటల విరామంతో మూడు పర్యాయాలు మామిడి పండును, ప్రతిసారి సగానికి మించకుండా తీసుకోవచ్చు. వేయించిన శనగలు లేదా పెసరపప్పుతో పాటు మామిడి పండును తీసుకున్నట్లయితే ప్రొటీన్స్, ఫైబర్ తగినంత లభించి రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోకుండా నియంత్రణలో ఉంటుంది. 






జాగ్రత్తలు పాటిస్తే మధుమేహాన్ని జయించవచ్చు!
మధుమేహం.. చక్కెర (షుగర్) వ్యాధిగా పిలిచే దీనిపేరులో చక్కెర ఉన్నా.. దీని బారినపడివారి నిత్య జీవితం చేదుగా మారుతుంది. వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ గా పిలిచే ఈ వ్యాధి బారిన పడినవారు ఆహారం నుంచి పరిశుభ్రత దాకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఉండిపోతుంది. అయితే మధుమేహం ప్రాణాంతకమైన వ్యాధేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. మిగతావారిలాగే అన్ని రకాల ఆహార పదార్థాలనూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

గ్లూకోజ్ పెరిగిపోవడమే..
రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పరిమితికి మించి పెరిగిపోవడాన్నే మధుమేహంగా చెప్పవచ్చు. దీని వల్ల శరీర పనితీరు దెబ్బతింటుంది. ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోవడానికి కారణం క్లోమ గ్రంథి ఇన్సూలిన్ ను తగిన స్థాయిలో విడుదల చేయకపోవడమే. రక్తంలో చక్కెర శాతాలను పరీక్షించడం ద్వారా ప్రాథమికంగా డయాబెటిస్ ను గుర్తించవచ్చు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా అందులో 25 శాతానికిపైగా అంటే 4.5 కోట్ల మంది ఒక్క భారతదేశంలోనే ఉన్నట్లు అంచనా. దేశంలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది.

జీవనశైలిలో మార్పే కారణం
మారుతున్న జీవన శైలి.. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం.. పెద్దగా శ్రమించవలసిన అవసరం లేకుండా పోవడం.. భోజనం, నిద్ర సమయాల్లో క్రమబద్ధత లోపించడం వంటివి మధుమేహానికి కారణాలు. వీటితోపాటు వంశపారంపర్యంగా అంటే తల్లిదండ్రులకు, వారికన్నా ముందు తరాల వారికి మధుమేహం ఉంటే అది తర్వాతి తరాల వారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఒక్కోసారి కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వచ్చే అవకాశముంది. మధుమేహంలో మూడు రకాలు ఉన్నాయి. టైప్-1, టైప్-2, గెస్టేషనల్ (మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్).

లక్షణాలివే..
తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, దాహం ఎక్కువగా వేయడం, కారణం లేకుండానే బరువు తగ్గడం, విపరీతమైన నీరసం, చూపు మందగించడం, పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు, శరీరంపై తగిలిన గాయాలు ఎప్పటికీ తగ్గకపోవడం, తరచూ ఆకలి వేయడం, కాళ్లలో స్పర్శ తగ్గిపోవడం వంటివి మధుమేహం లక్షణాలు. మూత్రపిండాలకు కూడా హాని కలుగుతుంది. టైప్-1, టైప్-2, గెస్టేషనల్ డయాబెటిస్ అన్నింటిలోనూ లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కానీ టైప్-1 డయాబెటిస్ మిగతావాటికన్నా ప్రమాదకరం. దీని బారిన పడినవారు దాదాపుగా జీవితాంతం ఇన్సూలిన్ ను తీసుకోవాల్సి రావడంతోపాటు పూర్తి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

గ్లూకోజ్ ఎంత మోతాదులో ఉండాలి?
- సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి భోజనం చేసిన ఎనిమిది గంటల తర్వాత (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) 100 మిల్లీగ్రాముల లోపు ఉంటుంది. ఒక వేళ ఇది 126 మిల్లీగ్రాములకన్నా ఎక్కువగా ఉంటే వారు మధుమేహం బారిన పడినట్లే. అదే 100 నుంచి 126 మిల్లీగ్రాముల మధ్య ఉంటే వారు త్వరలోనే డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉన్నట్లే. అదే 100 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు లేనట్లే.

- ఇక భోజనం చేసిన తర్వాత చేసే సాధారణ రక్త పరీక్ష (ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్)లో గ్లూకోజ్ స్థాయి 140 మిల్లీగ్రాముల నుంచి 200 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇది 200 మిల్లీగ్రాములు దాటితే మధుమేహం దరి చేరినట్లే. అదే 140కన్నా తక్కువగా ఉంటే మధుమేహం గురించి భయపడాల్సిన పనిలేదు. ఇక 200 మిల్లీగ్రాముల కన్నా కొద్దిగా తక్కువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని గుర్తించవచ్చు.

- రక్తంలో చక్కెర శాతాన్ని ఎప్పటికప్పడు పరీక్షించుకోవడానికి బ్లడ్ గ్లూకోజ్ మానిటర్లు అందుబాటులో ఉన్నాయి. వేలిపై సూదితో గుచ్చి, ఓ ప్రత్యేకమైన స్ట్రిప్ పై రక్తపుబొట్టును వేసి పరికరంలో ఉంచడం ద్వారా నిమిషాల్లోనే గ్లూకోజ్ స్థాయిని తెలుసుకోవచ్చు.

- ఇక మూత్రంలో గ్లూకోజ్ శాతాన్ని పరీక్షించడం ద్వారా కూడా మధుమేహాన్ని నిర్ధారించవచ్చు. కానీ శరీరంలో ఇతర రుగ్మతల కారణంగా కూడా మూత్రంలో గ్లూకోజ్ వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఓజీటీటీ పరీక్ష చేయించుకోవడం అత్యుత్తమం.

ఓజీటీటీతో కచ్చితంగా గుర్తించొచ్చు
మధుమేహాన్ని కచ్చితంగా గుర్తించే పరీక్ష ‘ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ)’. ఇది చాలా సులువైనది. ముందుగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తారు. తర్వాత 75 గ్రాముల గ్లూకోజ్ ను తాగిస్తారు. తర్వాత గంట, రెండు గంటలు, మూడు గంటల వ్యవధిలో మూడుసార్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పరీక్షిస్తారు. మొదటిదానిలో గ్లూకోజ్ స్థాయి 200 మిల్లీగ్రాములలోపు, రెండో దానిలో 140 మిల్లీగ్రాములలోపు ఉంటే డయాబెటిస్ లేనట్లే. అంతకన్నా ఎక్కువగా ఉంటే మధుమేహం వచ్చినట్లు. ఫాస్టింగ్ టెస్ట్ లో 126 మిల్లీగ్రాములలోపు గ్లూకోజ్ స్థాయి ఉన్నా.. ఓజీటీటీలోని రెండో పరీక్షలో 140 నుంచి 199 మధ్య ఉంటే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

హిమోగ్లోబిన్ ఏ1సీ (HB A1C)(హెచ్ బీ ఏ1సీ) పరీక్ష
మధుమేహంతో ఉన్నవారికి సాధారణంగా చేసే రక్త పరీక్షలు ఆ సమయంలో పరిస్థితిని మాత్రమే తెలియజేస్తే.. హిమోగ్లోబిన్ ఏ1సీ పరీక్ష దాదాపు మూడు నెలల నుంచి రక్తంలో గ్లూకోజ్ నిల్వలు ఏ స్థాయిలో కొనసాగాయనే అంశాన్ని తేల్చుతుంది. అంటే దీనివల్ల A1C పరీక్షకు ముందు మూడు నెలల పాటు మధుమేహ బాధితులు తీసుకున్న ఆహారం, చేసిన వ్యాయామంతోపాటు ఇతర జాగ్రత్తలను వైద్యులు సమీక్షించవచ్చు. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ కు అంటుకున్న గ్లూకోజ్ స్థాయిని లెక్కించడం ద్వారా ఈ పరీక్ష చేస్తారు. అధిక స్థాయిలో ఉండే గ్లూకోజ్ శరీరంలోని పలు రకాల కణాలపై చేరుతూ ఉంటుంది. అదే తరహాలో ఎర్రరక్త కణాలకూ అంటుకుంటుంది. ఈ కణాల జీవితకాలం మూడు నెలలు. అందువల్ల గత మూడు నెలల గ్లూకోజ్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఈ హిమోగ్లోబిన్ A1C పరీక్షలో సాధారణ వ్యక్తులకు వచ్చే ఫలితం 4% నుంచి 5.6% వరకు ఉంటుంది. అదే 6.5శాతానికి మించితే మధుమేహం ఎక్కువగా ఉన్నట్లే లెక్క. అదే 7 శాతానికి మించితే మధుమేహం వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా తీవ్రమవుతాయి. ఇక 5.7% నుంచి 6.4% వరకు ఉంటే వారికి త్వరలోనే మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్లే

మధుమేహం వచ్చే ముందు లక్షణాలు
రక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరుగుతుండడాన్ని బట్టి మధుమేహం వచ్చే అవకాశాలను గమనించవచ్చు. అయితే ఇవి మధుమేహం వచ్చినప్పటి గ్లూకోజ్ స్థాయులకంటే తక్కువగా ఉంటాయి. అంటే శరీరంలోని కణాల్లో ఇన్సూలిన్ కు నిరోధకత పెరుగుతున్నట్లు. దానితో పాటు మూత్రంలో గ్లూకోజ్ ఉంటే త్వరలోనే మధుమేహం బారినపడే అవకాశమున్నట్లే. ఇక తగినంతగా ఆహారం తీసుకుంటున్నా కూడా సన్నబడుతూ.. అదే సమయంలో పొట్ట మాత్రం పెరుగుతూ ఉంటుంది. కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. అయితే కొంత మందిలో ఇలాంటి ఏ లక్షణాలూ కనిపించకుండానే మధుమేహం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

టైప్-1తో ప్రమాదం ఎక్కువ
మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ క్లోమగ్రంథిలోని బీటా కణాలను స్వయంగా నాశనం చేయడం వల్ల టైప్-1 మధుమేహం కలుగుతుంది. దీన్ని ఇన్సూలిన్ డిపెండెంట్ డయాబెటిక్ లేదా జువెనైల్ డయాబెటిక్ అని కూడా పేర్కొంటారు. ఇది పెద్దలలో గానీ పిల్లలలోగాని ఎవరిలోనైనా రావచ్చు. మొత్తం మధుమేహ బాధితుల్లో టైప్-1 వారు పది శాతం వరకూ ఉంటారు. దీని బారినపడిన వారిలో క్లోమగ్రంథి ఇన్సూలిన్ ను కొంత మొత్తంలోగానీ లేదా మొత్తంగా విడుదల చేయలేకపోవడం గానీ జరుగుతుంది. అందువల్ల వారు జీవితాంతం బయటి నుంచి ఇన్సూలిన్ ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సిందే. టైప్-1 మధుమేహం ఏ దశలో ఉన్నా కూడా రక్తంలోని గ్లుకోజ్ నిల్వల స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. వీరు ప్రత్యేకమైన ఆహార నియంత్రణను పాటించాల్సి ఉంటుంది.

టైప్-2కు కొన్ని జాగ్రత్తలు చాలు
మారుతున్న జీవన శైలి కారణంగా వచ్చే డయాబెటిస్ టైప్-2. ఇందులో శరీరంలోని కణాలు ఇన్సూలిన్ కు నిరోధకత పెంచుకుంటాయి. దాంతో మరింత ఎక్కువ ఇన్సూలిన్ అవసరమవుతుంది. జంక్ ఫుడ్, వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం.. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం.. వాతావరణ కాలుష్యం, శారీరక శ్రమ లోపించడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, స్థూలకాయం, పొట్టచుట్టూ విపరీతంగా కొవ్వు పేరుకుపోవడం వంటివి ఈ తరహా మధుమేహానికి కారణం అవుతాయి. మొత్తంగా మధుమేహ బాధితుల్లో 90 శాతం వరకూ టైప్-2కు చెందినవారే ఉంటారు. 

దక్షిణాసియా వాసులకు ఈ తరహా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. శారీరక శ్రమ అంటే వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేసుకోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండడం, కూర్చుని పనిచేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో లేచి కాసేపు స్వల్పస్థాయి వ్యాయామాలు చేయడం వంటివాటితో ఈ రకం మధుమేహాన్ని చాలా వరకూ అదుపులో పెట్టుకోవచ్చు. కొంతమంది మాత్రం నిత్యం మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూలిన్ తీసుకోవాల్సి వస్తుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో చాలా మంది తొలి దశలో తమకు మధుమేహం ఉన్నట్లు గుర్తించలేరు. తర్వాతి దశకు చేరేసరికి గుర్తించినా.. అప్పటికే మూత్రపిండాల సమస్యలు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

గర్భిణులూ జాగ్రత్త
మహిళలకు గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. దీనిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. దాదాపు 2 నుంచి 5 శాతం మందిలో గర్భంతో ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతుంటాయి. ఇది కూడా గర్భధారణ సమయంలో హార్మోన్లు, శారీరక మార్పుల కారణంగా ఇన్సూలిన్ నిరోధకత ఏర్పడడం వల్ల వస్తుంది. అంతేగాకుండా రక్తంలోని గ్లూకోజ్ మొత్తాన్నీ రవాణా చేయగలిగేంతగా వారిలో ఇన్సూలిన్ ఉత్పత్తి కాదు. గర్భిణులు రక్త పరీక్షల ద్వారా దీనిని గుర్తించడం అత్యంత ఆవశ్యకం. లేకపోతే తల్లీ బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశముంది. పిల్లలు ఉండవలసిన దానికంటే అధిక బరువుతో జన్మిస్తారు. దాంతో సాధారణ ప్రసవం కష్టమై.. సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా మధుమేహం ప్రసవం తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఇలా గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చి తగ్గిపోయిన మహిళల్లో దాదాపు సగం మందికి తర్వాత పది ఇరవై ఏళ్లలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇక కొంత మంది మహిళల్లో ప్రసవం తర్వాత అదే మధుమేహం కొనసాగే అవకాశముంది.

పరిమితికి మించి తినొద్దు
మధుమేహంతో ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా మొత్తంగా శరీరానికి ఆ సమయంలో అందే మొత్తం శక్తి (కేలరీలు) నిర్ధారిత మొత్తానికి మించకూడదు. మామూలుగా మధ్య స్థాయిలో శారీరక శ్రమ ఉన్న పనిచేసే వ్యక్తులకు రోజుకు 1,800 నుంచి 2,200 వరకూ కేలరీల శక్తి సరిపోతుంది. కష్టమైన పనులు చేసేవారికి 2,500 కేలరీల వరకూ అవసరం. ఇంతకు మించి శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే.. అది శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. ఇది మధుమేహంతో బాధపడేవారికి మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.

తీపి పదార్థాలూ తినొచ్చు
సాధారణంగా మధుమేహులు తీపి పదార్థాలు తినకూడదని భావిస్తుంటారు. కానీ మధుమేహంతో ఉన్నవారు ఏ ఆహార పదార్థాలనైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే కొంత వరకూ పరిమితులు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు తీపి పదార్థాలు త్వరగా జీర్ణమై వెంటనే రక్తంలోకి గ్లూకోజ్ విడుదలవుతుంది. దీంతో ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. అదే చపాతీలు, అన్నం కాస్త ఆలస్యంగా జీర్ణమవుతూ గ్లూకోజ్ రక్తంలోకి మెల్లమెల్లగా చేరుతుంది. ఈ కారణం వల్లే తీపి పదార్థాలు తీసుకోవద్దని చెబుతూ ఉంటారు. కానీ తీపి పదార్థాలను కూడా స్వల్ప స్థాయిలో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంటే తక్కువ మొత్తాల్లో నాలుగైదు గంటల విరామంతో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక లడ్డూను సాధారణ వ్యక్తులు ఒకేసారి తినేస్తే... మధుమేహ బాధితులు ఆ లడ్డూను ముడు నాలుగు భాగాలు చేసి, నాలుగైదు గంటల విరామంతో ఒక్కో భాగాన్ని తినాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అంత మేరకు మిగతా ఆహారాన్ని తగ్గించడం మర్చిపోవద్దు.

ఎందుకీ ఇన్సూలిన్?
మన శరీరానికి ఆహారం నుంచి శక్తి లభిస్తుంది. ఆహారం జీర్ణమైనప్పుడు గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తుంది. శరీరంలోని ప్రతి కణం జీవించి ఉండేందుకు, శక్తిని పొందేందుకు ఇది అత్యవసరం. అయితే మనం తరచూ శరీరానికి సరిపడేకన్నా ఎక్కువగానో, తక్కువగానో ఆహారాన్ని తీసుకుంటాం. ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పడు అధిక స్థాయిలో గ్లూకోజ్ తయారవుతుంది. అది శరీరంలో కొవ్వు రూపంలోకి మార్చబడి నిల్వచేయబడుతుంది. ఇలా గ్లూకోజ్ ను కొవ్వుగా మార్చేందుకు ఇన్సూలిన్ అత్యంత ఆవశ్యకం. దీనిని క్లోమగ్రంథిలోని లాంగర్ హాన్స్ పుటికల్లో ఉండే బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి. ఇన్సూలిన్ లేకపోతే గ్లూకోజ్ అంతా రక్తంలోనే ఉండిపోతుంది.

నియంత్రణ మన చేతుల్లోనే..
ఒకసారి మధుమేహం వచ్చాక దాదాపుగా జీవితాంతం తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇన్సూలిన్ ఉత్పత్తి సరిపడినంతగా లేకపోవడంతో రక్తంలో గ్లూకోజు స్థాయిని శరీరం దానంతట అది అదుపు చేసుకోలేదు. కాబట్టి మనమే బయట నుంచి దానిని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. దానినే ప్రత్యేకంగా ‘డయాబెటిక్ జీవన విధానం’ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మందుల వాడకం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అదుపులో ఉంచుకోవడం కేవలం 25 శాతమే. మిగతా 75 శాతం మన ఆహార అలవాట్లలో మార్పులు, సరైన స్థాయిలో నిద్ర, రోజూ వ్యాయామం చేయడం వంటి అంశాల చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా అదనపు కేలరీలను శరీరంలోకి పోకుండా ఆహారం మీద అదుపు, తిన్న ఆహారం నిలువలుగా పేరుకు పోకుండా ‘శ్రమ’ ద్వారా ఖర్చు చేయుట అవసరం. అప్పటికీ మధుమేహం అదుపులో ఉండకపోతే మందులు వాడాల్సి వస్తుంది. మందుల వల్ల కూడా ప్రయోజనం లేని పరిస్థితుల్లో బయటి నుంచి ఇన్సూలిన్ ను అందించడమే చివరి మార్గం.

వైద్యుల సూచనలు పాటించాలి
డయాబెటీస్‌ కలిగిన రోగులు వైద్యులు సూచించిన ఆహార ప్రణాళికలను తప్పనిసరిగా పాటించాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అది కూడా వైద్యులు సూచించిన తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయాలి. మందులు వాడాల్సిన అవసరమున్నవారు నిర్ధారిత వేళల్లో తప్పనిసరిగా తీసుకోవాలి. క్రమబద్ధంగా రక్తపు గ్లూకోజ్‌ స్థాయిని పరీక్షించుకుంటూ.. వివరాలను ఎప్పటికప్పడు ఒక నోట్ పుస్తకంలో నమోదుచేసి పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు వైద్యులకు చూపించి సరైన వైద్యం చేయించుకోవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ సూచనల మేరకు ఇన్సూలిన్‌ తీసుకోవాలి. తర్వాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సూలిన్‌ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్‌ తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు.

హైపోగ్లైసేమియా రాకుండా చూసుకోండి
హైపోగ్లైసేమియా అంటే రక్తంలో సాధారణంగా ఉండాల్సిన దానికంటే తక్కువగా చక్కెర స్థాయులు ఉండడం. ఇది చాలా ప్రమాదకరం. దీంతో రోగులు కోమాలోకి వెళ్లిపోయే అవకాశముంది. మధుమేహం ఉన్నవారు మాత్రలు వేసుకుని, ఇన్సూలిన్ తీసుకుని ఎక్కువ శారీరక శ్రమ చేసినా, వ్యాయామం చేసినా హైపోగ్లైసేమియా సమస్య తలెత్తుతుంది. అంతేగాకుండా ఇన్సూలిన్ మోతాదుకు మించి తీసుకోవడం, ఎక్కువ సమయం పాటు తినకుండా ఉండడం వల్ల కూడా వస్తుంది. ఇలాంటపుడు రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా పెంచుకునేలా వైద్యుల సూచనల మేరకు చర్యలు చేపట్టాలి.

ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎన్నో..
మధుమేహం వచ్చినవారిలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్ వంటివి చాలా ప్రమాదకరం. డయాబెటిక్ కీటో అసిడోసిస్ వల్ల కణాల స్థాయిలో జరిగే ప్రక్రియల్లో నియంత్రణ లోపిస్తుంది. దానివల్ల కణాల్లోంచి రక్తంలోకి కార్బన్ డయాక్సైడ్ తో పాటు అసిటోన్ కూడా చేరుతుంది. ఇది ఊపిరితిత్తుల్లోంచి శ్వాసక్రియలో భాగంగా బయటకు విడుదలవుతుంది. దీనివల్ల వేగంగా శ్వాస తీసుకోవడం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితి తీవ్రమైతే కోమాలోకి వెళ్లిపోతారు. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. ఇది టైప్-1 మధుమేహ బాధితుల్లోనే కనిపిస్తుంది. ఇక తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం కారణంగా శరీరంలో నీటిశాతం తగ్గిపోయి నాన్ కీటోటిక్ హైపర్ ఆస్మొలార్ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కూడా కోమాలోకి వెళ్లిపోయే అవకాశముంది. ఇది టైప్-2 మధుమేహ బాధితుల్లో అదికూడా చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇక ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్‌లో గ్లూకోస్ పేరుకుపోతుంది. దానితో గ్లకోమా సమస్య ఏర్పడి దృష్టి లోపాలు తలెత్తతుతాయి. చాలా అరుదుగా అయినా కంటిలోని రెటీనా దెబ్బతిని అంధత్వం వచ్చే అవకాశముంది. నాడీ కణాలు, సూక్ష్మ నాళికలు దెబ్బతినడం మూలంగా పురుషత్వ లోపం ఏర్పడుతుంది. కాళ్ళలో గాంగ్రీన్ తో ఒక్కోసారి అవిటితనం కూడా రావచ్చు.

ముఖ్యమైన జాగ్రత్తలివీ..

  • మధుమేహం బారినపడిన వారు దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకోవడం అవసరం.
  • రోజూ వ్యాయామం చేయడం, ఆహారం, నిద్రలకు సరైన సమయాలను పాటించాలి.
  • రక్తపోటు, కొలెస్టరాల్, గ్లూకోజ్ స్థాయుల పరీక్షలను నియమిత సమయాల్లో తప్పనిసరిగా చేయించుకోవాలి.
  • మధుమేహం ఉన్నవారు తమ కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు గుర్తించలేరు. అందువల్ల అప్పుడప్పుడు తమ పాదాల్లో స్పర్శ ఎలా ఉందో పరిశీలించుకోవాలి.
  • పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించి.. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి.
  • పాదాలకు ఎలాంటి గాయాలూ తగలకుండా జాగ్రత్త వహించాలి. అవసరమైతే ప్రత్యేకమైన బూట్లు ధరించాలి.
  • మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతిని, మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ వెళ్లిపోతుంటుంది. దానివల్ల కిడ్నీ ఫెయిలయ్యే అవకాశముంది. అందువల్ల మూడునాలుగు నెలలకోసారి మూత్ర పరీక్ష చేయించుకోవాలి.
  • మధుమేహం ఉన్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల ఎలాంటి సమస్యలూ లేకపోయినా ఏటా ఈసీజీ, ట్రెడ్‌మిల్‌, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి.

(ఆయా నిపుణుల అభిప్రాయాలు క్రోడీకరించి రాసిన ఈ ఆర్టికల్ ఉద్దేశం కేవలం ఆయా వ్యాధుల పట్ల పాఠకులలో అవగాహన కల్పించడం కోసం మాత్ర
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

 






కామెంట్‌లు లేవు: