23, మార్చి 2020, సోమవారం

కిడ్నీ సమస్య ఉన్న వారికీ నిద్ర సమస్య మరియు అలసట కు పరిష్కారం మార్గం

నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


కొందరిలో సరిగా నిద్ర పట్టదు.. నీరసంగా ఉండటం.. చర్మం ఎండిపోయి, దురదగా ఉండటం వంటివి బాధిస్తుంటాయి. ఇవి కిడ్నీ సంబంధిత వ్యాధులకు సూచికలు కావొచ్చు. ఇవేకాదు మనం సాధారణమైనవిగా భావించే చాలా లక్షణాలు మనలో కిడ్నీల పనితీరు దెబ్బతిన్న తొలిదశలో ఏర్పడుతాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే.. కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే నియంత్రించవచ్చు. అయితే ఈ లక్షణాలకు ఇతర కారణాలూ ఉండేందుకు అవకాశముంది. అందువల్ల కేవలం ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన కిడ్నీ సమస్యలు ఉన్నట్లుగా భావించవద్దు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. తగిన వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య ఏమిటో నిర్ధారించుకోవడం అవసరం. మరి కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపించే సమస్యలు, కారణాలేమిటో తెలుసుకుందాం..

సరిగా నిద్ర పట్టకపోవడం

 మన శరీరంలో కిడ్నీలు సరిగా పనిచేయకపోతే సరిగా నిద్రపట్టని పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో చేరే వ్యర్థాలు, విషపూరిత రసాయనాలు శరీరం నుంచి బయటికి విసర్జించబడవు. దీనివల్ల రక్తంలో విషపూరిత పదార్థాల శాతం పెరిగిపోయి.. శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇది నిద్ర పట్టని పరిస్థితికి దారితీస్తుంది.
  • ముఖ్యంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి సాధారణంగా స్లీప్ అప్నియా (గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా శ్వాస ఆడని పరిస్థితి) సమస్య వస్తుంటుంది.
  • విపరీతంగా గురక సమస్య ఉన్న వారికి కూడా కిడ్నీ సమస్యలు ఉండే అవకాశం ఎక్కువ. అలాంటివారు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

తలనొప్పి, నీరసం, బలహీనత..

ఆరోగ్యవంతమైన కిడ్నీలు మన శరీరం విటమిన్ డిని సంగ్రహించుకునేలా మార్చుతాయి. దాని వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దీంతోపాటు ఎరిత్రోపొయెటిన్ (Erythropoietin-EPO) అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి. ఈ హర్మోన్ శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో EPO హార్మోన్ సరిగా ఉత్పత్తి కాదు. దానివల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి.. కండరాలు, మెదడు బలహీనం అవుతాయి. 
  • తీవ్రమైన కిడ్నీల వ్యాధి (Chronic Kidney Disease)తో బాధపడేవారికి రక్త హీనత (ఎనీమియా) సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా కిడ్నీల పనితీరు 50 శాతంకన్నా తగ్గినప్పుడు ఈ సమస్య మొదలవుతుంది.
  • తగినంత విశ్రాంతి, నిద్ర ఉన్నా కూడా తరచూ అలసి పోయినట్లు ఉండటం, నీరసంగా ఉండటం వంటివి జరిగితే కిడ్నీలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

చర్మం ఎండిపోయి, దురదగా ఉండటం

 కిడ్నీలు శరీరంలో మలినాలను, వ్యర్థ రసాయనాలను తొలగిస్తాయని తెలిసిందే. అదే సమయంలో శరీరానికి అత్యవసరమైన లవణాలు తగిన స్థాయిలో ఉండేలా చూస్తాయి. అలాగాకుండా కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. మలినాలు, వ్యర్థాలు శరీరంలో పేరుకుపోవడం, తగినంతగా లవణాల స్థాయి కొనసాగకపోవడంతో.. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఆ వ్యర్థాలను విసర్జించేందుకు చర్మం ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో మలినాలు, వ్యర్థాల ప్రభావానికిలోనై చర్మం ఎండిపోవడం, దురదగా ఉండడం వంటి లక్షణాలు వస్తాయి. ఎప్పుడూ చర్మం ఎండిపోయినట్లుగా ఉంటుండటం, దురదగా ఉంటుండటం వంటివి కనిపిస్తే.. కిడ్నీ సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
  • సాధారణంగా చర్మం ఎండిపోయి, దురదగా ఉన్న సమయంలో నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఏవైనా మందులు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే పలు రకాల మందులు కిడ్నీల పనితీరును దెబ్బతీసే లక్షణాలను కలిగి ఉంటాయి.

శ్వాసలో దుర్వాసన.. నోటిలో లోహాన్ని రుచి చూసిన భావన

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. రక్తంలో మలినాలు, వ్యర్థాలు పేరుకుపోతాయని చెప్పుకొన్నాం. మరి ఇలా రక్తంలో వ్యర్థాలు, విషపూర్తిమైన పదార్థాలు పేరుకుపోతే.. నాలుకపై ఉండే రుచి గుళికల (టేస్ట్‌ బడ్స్‌) పనితీరుపై ప్రభావం పడుతుంది. దానివల్ల మనం తినే ఆహారం రుచిని సరిగా గుర్తించలేకపోతాం. ఏదో ఇనుప వస్తువును నోటిలో పెట్టుకున్నట్టుగా నోరంతా లోహపు తరహా రుచి కలిగిన భావన ఉంటుంది. 
  • ఇక కిడ్నీల్లో తగిన విధంగా శుద్ధికాని రక్తం ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తుల్లో రక్తంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ గాలిలోకి, గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి చేరే ప్రక్రియ సమయంలోనే.. రక్తంలో ఉన్న మలినాలు, విషపూరిత పదార్థాలు వాయురూపంలోకి మారి గాలిలో కలుస్తాయి. ఇలా మలినాలు, విషపూరిత రసాయనాలు కలసిన గాలి ఊపిరితిత్తుల్లోంచి బయటికి వచ్చినప్పుడు మన శ్వాసలో దుర్వాసన వస్తుంది. నోటి రుచి దెబ్బతినడం, శ్వాసలో దుర్వాసన కారణంగా సరిగా ఆకలి తగ్గిపోవడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం జరిగి.. బరువు తగ్గిపోతారు.
  • నోటిలో దుర్వాసన, లోహపు రుచి వంటివి తలెత్తినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
  • అయితే నోరు సరిగా శుభ్రం చేసుకోకపోవడం, అలర్జీలు వంటి ఇతర ఆరోగ్య కారణాల వల్ల కూడా శ్వాసలో దుర్వాసన, నోటిలో లోహపు తరహా రుచి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలే అయితే.. సాధారణ చికిత్స తోనే తగ్గిపోతాయి.
  • చికిత్స తీసుకున్నా రుచి, శ్వాస సమస్య తగ్గకపోతే కచ్చితంగా కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

సరిగా ఊపిరాడకపోవడం (షార్ట్ నెస్ ఆఫ్ బ్రీత్)

 కిడ్నీలు సరిగా పనిచేయని సమయంలో రక్తంలో, శరీరంలో ద్రవాల శాతం పెరుగుతుంది. అలాంటి సమయంలో ద్రవాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. దీనినే ఛాతీలో నీరు చేరడంగా కూడా చెబుతారు. ఇలా నీరు చేరడం వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. దాంతో ఛాతీలో గట్టిగా పట్టేసినట్టుగా ఉండడం, ఎక్కువ సార్లు.. వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది. దీనివల్ల రక్తానికి ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోయి.. మరింత ఆక్సిజన్ కోసం శ్వాస వేగంగా తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల ఇలాంటి సమస్య తలెత్తితే కిడ్నీ సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకోవడం బెటర్.
  • అయితే బ్రీత్ షార్ట్ నెస్ సమస్యకు ఆస్తమా, ఊపిరితిత్తుల కేన్సర్, గుండె పనితీరు దెబ్బతిని ఉండడం వంటి సమస్యలూ కారణమవుతాయి. కాబట్టి సరైన కారణం ఏమిటనేది గుర్తించే పరీక్షలు చేయించుకోవాలి.

చీలమండ (కీళ్లు), పాదాలు, చేతుల వాపు

 కిడ్నీలు సరిగా పనిచేయక శరీరంలో మలినాలు, అదనపు రసాయనాలు పేరుకుపోయినప్పుడు శరీరంలోని పలుచోట్ల వాపు లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో అదనంగా పేరుకునే సోడియం కారణంగా మన శరీరంలో చీలమండలు (పాదాల వద్ద కీళ్లు), పాదాలు, చేతులు ఉబ్బి వాచిపోతాయి. మందులు వాడినా కూడా తరచూ వాపు వస్తుంటుంది.
  • అయితే కాలేయ వ్యాధులు, కాలి రక్తనాళాల్లో సమస్యలు, గుండె జబ్బుల కారణంగా కూడా శరీరంలో కింది భాగాలు వాపునకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

నడుము నొప్పి

 కిడ్నీల పనితీరు దెబ్బతినడం, వాపు కారణంగా నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది. వీపుపై సరిగ్గా పక్కటెముకల కింద నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి వెనుక నుంచి ముందు వైపుపొట్ట వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీల్లో కణితులు ఏర్పడడం (పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్) వల్ల ఈ రకం నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది.
  • కిడ్నీల సమస్యల కారణంగా నడుము నొప్పి వచ్చినప్పుడు దానితోపాటు తీవ్ర అస్వస్థత, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, విపరీతంగా మూత్రం రావడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నొప్పికి మందులు వాడినా తగ్గకపోవడం, ఒకే చోట ఎక్కువగా నొప్పి ఉండడం వంటివి కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
  • అయితే సాధారణంగా మారుతున్న మన జీవన శైలి కారణంగా, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం ద్వారా కూడా నడుమునొప్పి వస్తుంటుంది. అందువల్ల నడుము నొప్పికి తగిన కారణమేమిటో గుర్తించాల్సి ఉంటుంది.

కళ్లు ఉబ్బడం

 కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనేదానికి ముందస్తు సూచిక కళ్లు ఉబ్బడం. దీనినే కళ్ల కింద, చుట్టూ బ్యాగులా తయారుకావడం అని చెప్పొచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోంచి మనకు అవసరమైన ప్రొటీన్లు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. దీనివల్ల శరీరంలో ప్రొటీన్ల లోపం తలెత్తుతుంది. దానివల్ల కళ్ల చుట్టూ ఊబ్బు ఏర్పడుతుంది.
  • మీ శరీరానికి అవసరమైన ప్రొటీన్లు తగినంతగా అందుతున్నా.. తగినంత విశ్రాంతి, నిద్ర ఉన్నా కూడా కళ్లు ఉబ్బడం వంటి సమస్య తలెత్తుతుంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అధిక రక్తపోటు

 మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థకు కిడ్నీలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కిడ్నీలలో ఉండే నెఫ్రాన్లు రక్తంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను, అధికంగా ఉన్న ద్రవాలను వడగడతాయి. ఇందుకోసం అతి సన్నని రక్త నాళాలు నెఫ్రాన్ల ద్వారా అనుసంధానమై ఉంటాయి. అయితే అధిక రక్తపోటు కారణంగా శరీరంలో అతి సన్నని రక్తనాళాలు దెబ్బతింటుంటాయి. ఇలా అధిక రక్తపోటు కారణంగా కిడ్నీల్లోని నెఫ్రాన్లకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు దెబ్బతిన్నప్పుడు... నెఫ్రాన్లకు ఆక్సిజన్, పోషకాలు అందక దెబ్బతింటాయి. ఈ కారణం వల్లే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
  •  అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కిడ్నీలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి.

మూత్రంలో మంట.. మూత్రం రంగు మారడం..

కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో మూత్రం పోసినప్పుడు మంటగా ఉండడం, మూత్రం రంగు మారడం వంటి లక్షణాలు ఉంటాయి. దాంతోపాటు దుర్వాసన వస్తుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా మూత్రానికి లేవాల్సి వస్తుంది.
  • మూత్రంలో రక్తం కనిపించడం కూడా కిడ్నీలు దెబ్బతిన్నదానికి సూచన. ఆరోగ్యవంతమైన కిడ్నీలు రక్తంలోని మలినాలను, వ్యర్థ రసాయనాలను జల్లెడపట్టి తొలగిస్తాయి. కానీ కిడ్నీలు దెబ్బతింటే.. మలినాలు, వ్యర్థాలను జల్లెడ పట్టడంతోపాటు రక్తం కూడా మూత్రంలోకి లీకవుతుంది.
  • మూత్రం నురగగా వస్తుండడం, బుడగల్లాంటివి ఏర్పడడం అంటే కిడ్నీలు దెబ్బతిని మూత్రంలో ప్రొటీన్లు వెళ్లిపోతున్నాయని అర్థం. అందువల్ల వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.

(వైద్య నిపుణుల సలహాలు, వివిధ అధ్యయనాల ఆధారంగా అవగాహన కోసం మాత్రమే రాసిన కథనం. ఏదేని ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి)
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
 *సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: